ముంబై: వాట్సాప్, జియోమార్ట్ అనుసంధానం ప్రయోగాత్మకంగా చేపడతామని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధ్రువీకరించారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సహకారంతో చేపడుతున్నట్లు చెప్పారు.
రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ వాట్సాప్, జియోమార్ట్ కస్టమర్ల విలువైన సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వచ్చే పదేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనిముకేశ్ అంబానీ చెప్పారు. తాము నేరుగా, భాగస్వాములతో కలిసి 200 బిలియన్ల డాలర్లకు పైగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నామని అన్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో చిన్న, మధ్య తరహా ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు.
రిలయన్స్ రిటైల్లో అద్భుతమైన గ్రోత్ ఉందని వచ్చే 3-5 ఏండ్లలో మూడు రెట్లు పెరుగుతుందన్నారు. గత ఏడాది కొత్తగా 1500 స్టోర్లు జత కలిశాయని చెప్పారు. ఇతర రిటైల్ సంస్థలేవీ చేయలేని రీతిలో భారీ స్థాయిలో తమ సంస్థ విస్తరణ చేపడుతున్నదన్నారు. దీంతో తమ స్టోర్ల సంఖ్య 12,711కి చేరుతుందన్నారు.
తమ అపారెల్ బిజినెస్ ప్రతి రోజూ సుమారు ఐదు లక్షల యూనిట్లు.. ఏటా 18 కోట్లకుపైగా యూనిట్లను విక్రయించిందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది జర్మనీ, బ్రిటన్, స్పెయిన్ జనాభాలతో సమానం అని చెప్పారు.