ఖానాపురం, మే 30 : కరోనా సమయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వైద్యసిబ్బంది విధు లకు గైర్హాజరైతే చర్యలు తప్పవని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానకు సంబంధించిన పలు రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఇన్చార్జి వైద్యాధికారి మల్యాల అరుణ్కుమార్, సిబ్బందితో ఆయన మాట్లాడారు. వైద్య ఉద్యోగులు, సిబ్బంది చాలా రోజులుగా విధులకు హాజరుకావడంలేదనే విషయాన్ని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, సీహెచ్వో శ్యామ్, స్టాఫ్నర్సు శ్రీవాణి, మంగమ్మ, అంటెడర్ వెంకటేశ్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడంపై పెద్ది సుదర్శన్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
కొందరు ఉద్యోగులు నెలల తరబడి విధులకు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ హరిత, డీఎంహెచ్వో మధుసూదన్ను ఎమ్మెల్యే పెద్ది కోరారు. కరోనా సమయంలో ఎంతో మంది వైద్యసిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కొందరు మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని అన్నా రు. వైద్య సేవలు అందించే క్రమంలో కరోనా బారిన పడిన ఉద్యోగులున్నారని, వారందరూ కోలుకున్న అనంతరం తిరిగి విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సుదర్శన్రెడ్డి అన్నారు. ఎవరైనా పోస్ట్ కొవిడ్తో బాధపడుతుంటే వారు అధికారుల అనుమతితో సెలవు తీసుకోవచ్చన్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేకుండానెలల తరబడి విధులకు గైర్హాజరవడం క్షమించరానిదని పెద్ది అన్నారు. వైద్య వృత్తిని గొప్ప వరంగా భావించి సిబ్బంది విధులు నిర్వర్తించాలని కోరారు. నిత్యం విధులకు హాజరవుతూ సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇన్చార్జి వైద్యుడు అరుణ్కుమార్కు పూర్తిస్థాయి బా ధ్యతలు అప్పగించాలని ఎంపీపీ ప్రకాశ్రావు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఇన్చార్జి వైద్యాధికారి అరుణ్కుమార్, ఏఎన్ఎమ్ సునీత పాల్గొన్నారు.