కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
‘నమస్తే’ కథనానికి స్పందన
పెంబి, ఏప్రిల్ 27 : మండల కేంద్రానికి చెందిన దరాడే అశోక్-అంజలి దంపతుల కూతురు త్రిష క్లోమం వాపు (క్రానిక్ ప్యాంక్రియాటైటిస్) వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నది. రూ.5 లక్షలు ఖర్చు చేస్తే బతుకుతుందని వైద్యులు చెప్పడంతో ఆ దినసరి కూలీ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూసింది. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘త్రిషను బతికించుకుందాం..’ అనే కథనానికి పలువురు దాతలు స్పందించారు. త్రిష చదివిన పెంబి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వారి తోటి ఉపాధ్యాయులు రూ.30 వేలు, లక్షెట్టిపేటకు చెందిన జగదీశ్ వారి మిత్రులు కలిసి రూ.13,600, ఎక్సైజ్ ఎస్ఐ సాంబమూర్తి రూ.10 వేలు, కొడగంటి సురేందర్ రూ.5వేలు, కుర్మ రాజేందర్ రెడ్డి రూ.2500, బింగి సతీశ్ రూ.1500, తులాల రాజు రూ.1500తో యువకులు, స్థానిక ప్రజలు తమకు తోచినంత సాయాన్ని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపించి పేద కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పటి వరకు రూ.1,14,377 సమకూరినట్లు అశోక్-అంజలి తెలిపారు. అండగా నిలిచిన దాతలకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. త్రిష ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతున్నదని పేర్కొన్నారు.