నవాబ్పేట, ఏప్రిల్ 7 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసిందని జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కొవిడ్ నియంత్రణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ కొవిడ్ సెకండ్వేవ్ ప్రారంభమైనందున ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని కోరారు. గ్రామాల్లో నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించేందుకు పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కలిపి టాస్క్ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటించని వారికి రూ.100 నుంచి రూ.500వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో 45ఏండ్లు నిండిన వారు 50మంది ఒకే దగ్గర ఉన్నారని సమాచారం అందిస్తే వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి కొవిడ్ టీకా వేస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రునాయక్, ఏఈ సత్యనారాయణ, ఏపీవో జ్యోతి ఉన్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు
నారాయణపేట జిల్లాలో బుధవారం పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మొత్తం 1,013 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ వెల్లడించారు. నారాయణపేట పీపీ యూనిట్ పరిధిలో 4, ధన్వాడ పీహెచ్సీ పరిధిలో ఒకరు, గుండుమాల్ పీహెచ్సీ పరిధిలో ఇద్దరు, కర్నె పీహెచ్సీ పరిధిలో ఇద్దరు, పులిమామిడి పీహెచ్సీ పరిధిలో ముగ్గురు, మాగనూర్ పీహెచ్సీ పరిధిలో ఒకరు, కోటకొండ పీహెచ్సీ పరిధిలో 8, మరికల్ పీహెచ్సీ పరిధిలో ఇద్దరు, మద్దూర్ పీహెచ్సీ పరిధిలో ఒకరి పాజిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై ఏ మాత్రం నిర్లక్ష్యం పనికి రాదని, జాగ్రత్తలతోనే నివారణ సాధ్యమని, 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు.