భద్రాద్రి : ఇసుక లారీ, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామం వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. లారీ, డీసీఎం వేగంగా ఢీకొనడంతో రెండు వాహనాల్లోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాయంత్రం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.