మంచిర్యాల : వంద సెకన్లలో వంద దేశాల జాతీయ జెండాలను గుర్తించి మంచిర్యాల విద్యార్థులు రికార్డు సృష్టించారు. అభ్యాస సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు చెందిన 5 నుండి 12 ఏళ్ల విద్యార్థులు జాతీయ జెండాలను గుర్తించి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్(ఐజీబీఆర్)లో స్థానం సంపాదించారు. కార్యక్రమానికి ఐజీబీఆర్ భారత చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలో జాతీయజెండాలను విజయవంతంగా గుర్తించినందుకు విద్యార్థుల ఫీట్ను ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసినట్లు నరేందర్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేయడంతో పాటు సంస్థ ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించినట్లు చెప్పారు. విద్యార్థుల అత్యుత్తమ జ్ఞాపకశక్తి నైపుణ్యాలను కార్యక్రమ సమన్వయకర్త ప్రశంసించారు. వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంస్థ కరస్పాండెంట్ సనా సుధతిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల సహజ ప్రతిభను బహిర్గత పరిచినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించిన విద్యార్థులను సుధతి అభినందించారు. విద్యార్థులకు 21 రోజుల వ్యవధిలో రోజుకు మూడు గంటలపాటు శిక్షణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించినందుకు అదేవిధంగా దానిని నిర్వహించడంలో తమకు మద్దతు ఇచ్చిన తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.