తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్లపై కాణిపాకం బయల్దేరారు. ఐతేపల్లి వద్ద రాగానే చిత్తూరు నుంచి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన అలేఖ్య తిరుపతి రుయా దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహాలను పోస్టుమార్టం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.