జెరూసలేం: ఇజ్రేల్, హమాస్ పరస్పరం జరుపుకుంటున్న రాకెట్ దాడికి 15 అంతస్థుల మీడియా భవనం బలైంది. అల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ ఆఫీసులున్న అపార్ట్మెంట్ టవర్ ఇజ్రేల్ రాకెట్ల దాడిలో ధ్వంసమైంది. ఇంటర్నెట్ కంపెనీలుతో పాటుగా సాధారణ పౌరులు నివసించే ఆ భవనాన్ని ఇజ్రేల్ ఎందుకు లక్ష్యంగా ఎంచుకుందో ఇంకా స్పష్టం కాలేదు. ఎంత మంది మరణించిందీ వంటి వివరాలు ఇంకా అందలేదు. కానీ ఈ రాకెట్ దాడులను పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పలువురు ఖండించారు. ఆ టవర్ పేరు అల్ జలాలా. దానిని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రేలీ మిలిటరీ అధికారులు ఆదేశించిన గంట తర్వాత రాకెట్లు వచ్చి పడ్డాయి. ఆ భవనంలో ప్రైవేటు ఫ్లాట్లు కూడా ఉన్నాయని అంటున్నారు. వరుసగా ఆరో రోజు ఇజ్రేల్-హమాస్ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. అల్ జజీరా తదితర మీడియా సంస్థల ఆఫీసులున్న ఆ భవనం ఖాళీ చేయాలని ఇజ్రేలీ ఆర్మీ కేవలం గంట టైమ్ ఇచ్చింది. అంతకుముందే మా సిబ్బంది ఖాళీ చేశారు అని అల్ జజీరా ఇంగ్లిష్ డివిజన్లో పనిచేసే లీనా అల్సాఫిన్ ట్విట్టర్ లో తెలిపారు. ఆ తర్వాత ఆరు సార్లు రాకెట్ దాడులు జరిగాయి. భవనం మొత్తంగా కుప్పకూలింది.