న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వందకు పైగా కార్లను చోరీ చేసి ఆపై వాటిని కశ్మీర్లో అమ్ముతున్న ఇద్దరు ఘరానా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్, మహ్మద్ జుబేర్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో కార్లను చోరీ చేసేందుకు వీరు కశ్మీర్ నుంచి దేశ రాజధానికి తరచూ వస్తుంటారని, ఆపై వాటిని కస్టమర్లకు ఆకర్షణీయ ధరల్లో విక్రయించేందుకు కశ్మీర్కు తిరిగివస్తుంటారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరు ఇప్పటికే ఢిల్లీ, యూపీ పరిధిలో వందకు పైగా కార్లను దొంగిలించినట్టు తేలింది.
తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ కాంట్రాక్టర్గా పనిచేసే షౌకత్ అహ్మద్ ఈ వృత్తిని ఎంచుకున్నాడని పోలీసులు చెప్పారు. ఇక యూపీకి చెందిన జుబేర్ దొంగిలించిన కార్లను అమ్మేందుకు అహ్మద్ స్నేహితుడు రింకూ సహకారంతో కస్టమర్లకు వాటిని చేరవేస్తుంటాడు.