కొండపాక/సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. కుకునూరుపల్లి ఎస్సై సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎండీ సద్దాం, శ్రీకాంత్ పాల్, రామ్ గోపాల్ సింగ్ అనే వలస కార్మికులు తిప్పారం వద్ద మల్లన్న సాగర్ కట్ట నిర్మాణం చేస్తున్న వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్నారు.
సోమవారం సాయంత్రం వీరు ముగ్గురు మోటార్ సైకిల్ పై తిప్పారం నుంచి కుకునూరుపల్లికి బయలుదేరారు. మంగోల్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపైకి చేరుకునే సమయంలో వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో రోడ్డుకు అవతలి వైపు పడిపోయారు. అదే సమయంలో సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ వీరు పైనుంచి వెళ్లిపోవడంతో ఎండీ సద్దాం, శ్రీకాంత్ పాల్ అక్కడికక్కడే మృతి చెందగా రామ్ గోపాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం తెలుసుకున్న కుకునూరుపల్లి ఎస్సై సాయిరాం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ రామ్ గోపాల్ సింగ్ను అంబులెన్స్లో దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు