బండ్లగూడ, ఏప్రిల్ 27 : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అత్తాపూర్ డివిజన్ పరిధిలోని దేవాలయ భూముల్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు దేవాదాయ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు తమ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ఆయా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
దీంతో గత కొన్ని రోజుల కిందట రాంబాగ్లోని ఓ భవనాన్ని కోర్టు ఉత్తర్వులతో పాటు పోలీసుల సహాయంతో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే దేవాలయ భూములు తమకు రాసిచ్చారన్నట్లుగా రికార్డులు మార్చిన ఓ కబ్జాదారుడు.. ఆలయ భూములను ఆక్రమించి చేపడుతున్న భారీ నిర్మాణాన్ని సోమవారం కోర్టు ఉత్తర్వులతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ దేవాలయ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదని, ఒకవేళ నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుంటారని తెలిపారు.
అయినా కొంతమంది కబ్జాదారులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతుండటంతో హైకోర్టు నుంచి తాము స్టే తీసుకొచ్చామని, అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామన్నారు. ఇందుకు పోలీసులు కూడా తమవంతు సహాయసహకారాలు అందించడం అభినందనీయమన్నారు. త్వరలో అత్తాపూర్ డివిజన్ పరిధిలోని దేవాలయ భూముల్లో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు ఆ భూములను స్వాధీనం చేసుకుని రక్షణ కల్పిస్తామన్నారు.