సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల గౌరవ వేతనాలు30శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రజాప్రతినిధుల హర్షం
బయ్యారం, జూన్ 16 : నిత్యం ప్రజాసమస్యల కోసం పాటుపడుతూ.. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల గౌరవ వేతనాలు 30శాతం పెంచుతున్నట్లు ప్రకటించడంతో వారి హర్షం వ్యక్తమవుతోంది. సమైక్య పాలనలో కనీసం గుర్తింపు లేకపోగా గౌరవ వేతనం అంతంత మాత్రంగా ఎప్పుడో వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వారి గౌరవాన్ని మరింత పెంచుతుండడంతో ప్రజాప్రతినిధుల నూతనోత్త్తేజంతో అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
దక్కిన సముచిత గౌరవం..
ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కింది. గత ప్రభుత్వాల హయాంలో మేజర్ పంచాయతీ సర్పంచ్లకు వెయ్యి, చిన్న పంచాయతీ సర్పంచ్లకు రూ.600, ఎంపీటీసీలకు రూ.2500, ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.5000 మాత్రమే గౌరవ వేతనం అందించారు. అంతేకాకుండా అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గౌరవాన్ని మరింత పెంచాలని భావించి సర్పంచ్లు, ఎంపీటీసీలకు 5వేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు 10వేల గౌరవ వేతనాన్ని పెంచి సకాలంలో అందించారు. తాజా నిర్ణయంతో గతం కంటే మరో 30శాతం వీరి వేతనం పెంచారు. ఉద్యోగులకు పీఆర్సీ పెంచిన సమయంలో ప్రజాప్రతినిధులును గుర్తించి గౌరవ వేతనం పెంచడంతో సర్వత్రా హర్షాతికాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్సాహంగా ప్రజాసేవ
ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించిన ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచడంతో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇటు ప్రజాసేవతో పాటు గ్రామాల అభివృద్ధి పనుల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. గ్రామాల్లో సౌకర్యాల కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కరోనా కట్టడి కోసం నిత్యం పాటుపడుతున్నారు. ప్రభుత్వం గౌరవ వేతనం పెంచడంతో మరింత కృషిచేస్తామని చెబుతున్నారు.
గురి్ంతపు ఘనత సీఎం కేసీఆర్దే..
రాష్టంలోని ప్రజాప్రతినిధులకు గుర్తింపు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దే. అన్ని వర్గాల ప్రజల అభ్యన్నతి కోసం కృషిచేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచడం హర్షనీయం. ప్రజాసేవ చేస్తున్న ప్రజా ప్రతినిధులకు సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజా శ్రేయస్సు కోసం సర్పంచ్లు మరింత పాటుపడుతారు. ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది.
ఎం.సత్యనారాయణరావు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, మహబూబాబాద్
ఎంతో ఆనందంగా ఉంది..
ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తొలిసారి గౌరవ వేతనం పొందిన రోజు చాలా సంతోషించా. మళ్లీ ఇప్పుడు సీఎం సారు మముల్ని గుర్తించి గౌరవ వేతనం పెంచడం ఎంతో అనందంగా ఉంది. గ్రామాల్లోని ప్రజల సమస్యల సమస్యలు తీర్చి అభివృద్ధి కోసం పాటు పడుతున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి గుర్తింపు ఇస్తోంది. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రజాప్రతినిధులకు గుర్తింపు నివ్వటంతో ప్రజల నుండి కూడ మంచి ఆదరణ లభిస్తుంది.
తమ్మిశెట్టి కుమారి, ఎంపీటీసీ,