న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్రం తుగ్లక్ విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వైరస్ నియంత్రణకు తుగ్లక్ ‘లాక్డౌన్, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి చేస్తోంది’ శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో రికార్డు స్థాయిలో శుక్రవారం 2,17,353 కొవిడ్ కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 1.43 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కొవిడ్ నియంత్రణ చర్యలు, టీకా పంపిణీ, కేంద్రం నిర్ణయాలను చాలా సార్లు తప్పుపట్టింది.
గతేడాది కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ విధించడంతో పాటు.. చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి కరోనా వారియర్స్కు మద్దతు నిలువాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా రాహుల్ కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో తీసుకున్న నిర్ణయంపై కూడా రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. కొద్దిరోజుల కిందటే రాహుల్ గాంధీ ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.