వికారాబాద్ : ఉధృతంగా పారుతున్న వాగును దాటే ప్రయత్నం చేస్తూ, బైక్తో సహా ఓ వ్యక్తి వాగులో కొట్టుకపోయి మృతి చెందిన సంఘటన పులుసుమామిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు షేక్ ఇసాక్ పాషా(30)కు సంవత్సరంన్నర క్రితమే సమీనభేగంతో వివాహం జరిగింది. వీరికి రెండు నెలల క్రితమే ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. బోరు మెకానిక్కు సంబంధించిన పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం మెకానిక్కు సంబంధించిన వస్తువులు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. రాత్రి భారీ వర్షం కురువడంతో చెరువులు నీటి ప్రవాహంతో ఉధృతంగా పారుతున్నాయి.
పులుసుమామిడి వాగుకు అటువైపు ఉన్న అధికారులు రావద్దని హెచ్చరించినా వినకుండా ఇసాక్పాషా వాగు దాటే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో బైక్తో సహా కొట్టుకపోతుండటంతో అధికారులు, పోలీసులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. గళ్లంతైన వ్యక్తి కోసం మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా, నవాబుపేట మండలం అత్తాపూర్ గ్రామ సమీపంలో శవమై కనిపించాడు. పులుసుమామిడి వాగును వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావులు పరిశీలించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించా రు. వారి వెంట మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు ఉన్నారు.