నార్నూర్ : మండలంలోని గుండాయి చెక్డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు అకస్మత్తుగా వచ్చిన వరదలో చిక్కుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని స్థానికుల సహాయంతో కాపాడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్న ఘటన నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది. గురువారం ఉ మ్మడి మండంలోని పలు గ్రామాల్లో రెండుగంటల పాటు భారీ వర్షం కురిసింది. గుండాయి చెక్డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారంతా హుటాహుటిన చెక్డ్యాం వద్దకు చేరుకున్నారు. నార్నూర్ ఎస్ఐ డీ.రమేశ్కు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తాడు సహాయంతో ముగ్గురు యువకులను సురక్షితంగా బయటకు తీశారు.
సకాలంలో స్పందించిన పోలీసులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా గాదిగూడ మండలంలోని ప్రధాన రోడ్డులోని ఖడ్కి కల్వర్టు, లోకారి(కే)కల్వర్టులపై వరద పారడంతో ప్రయాణీకులు వరదనీరు తగ్గుముఖం పట్టేవరకు ఇబ్బందులు పడ్డారు. ఖఢ్కి కల్వర్టులో మ్యాక్స్ ఇరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా బయటికి తీశారు. ఎంపల్లి చెక్డ్యాం తుముపై వరద ప్రవహించింది.