పట్నా : అభ్యంతరకర వీడియోలను బహిర్గతం చేస్తామని యువతిని బ్లాక్మెయిల్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లోని ఒకరితో యువతికి గతంలో సన్నిహిత సంబంధం ఉంది. యువతి అభ్యంతరకర వీడియోలను తీసిన నిందితుడు ఆపై ఆమెను బెదిరించి మరో ఇద్దరి స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత ఏడాదిగా వీడియోలను చూపుతూ యువతిని బెదిరించి నిందితుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తమకు సహకరించకుంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించేవాడు. మంగళవారం సైతం ఇదే తరహాలో ఝాన్సీ ప్రాంతంలోని ఓ ఇంటికి రావాలని యువతిని నిందితుడు కోరాడు. ఈ క్రమంలో యువతి పోలీసులకు సమాచారం చేరవేసి అక్కడికి వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు స్నేహితులతో నిందితుడు ఆమె కోసం వేచిచూస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పుష్పేంద్ర కుష్వాహ (24), విశాల్ యాదవ్ (23), హర్ష్ దివాన్ (23)లుగా పోలీసులు గుర్తించారు.