పకడ్బందీగా ధాన్యం సేకరణ
రైతులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు
10.50 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి దిగుబడి అంచనా
442 కేంద్రాల్లో 8లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
సమీక్షాసమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కరోనా వ్యాప్తి నియంత్రణలో మరోమారు స్ఫూర్తిని చాటాలని పిలుపు…
నిజామాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ యాసంగి సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున దిగుబడి అంచనాలకు తగ్గట్టుగానే ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్లు, కరోనా కేసుల నియంత్రణ చర్యలపై అధికారులతో మంత్రి వేముల శనివారం సమీక్ష నిర్వహిం చారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో, ధాన్యం సేకరణలో జాప్యాన్ని నివారించేందుకు పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయిల్లో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ కమిటీలను నియమించాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆయన ఆదేశించారు. ఈసారి 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని, 442 కేంద్రాల ద్వారా 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.
దేశంలో అన్ని ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు మూత పడుతుంటే.. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. యాసంగి సీజన్లో పంట సాగు విస్తీర్ణం భారీగా పెరగడంతో దిగుబడి అంచనాలు అధికంగానే ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్లు, కరోనా కేసుల నియంత్రణ చర్యలపై జిల్లా యంత్రాంగంతో మంత్రి వేముల శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రగతిభవన్లో చర్చించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు నిర్వహణ కమిటీలను నియమించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి సాగు సంబురం..
గతంతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో పంటల సాగు బాగా పెరిగిందని మంత్రి వేముల సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు వెల్లడించిన గత సాగు లెక్కలను మంత్రి నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి జిల్లాలో సగటు పంటల సాగు విస్తీర్ణం లక్షా 92వేలు ఎకరాలుండగా… 2019-2020 యాసంగిలో 3లక్షల 18వేలు, 2020-2021 యాసంగిలో 3లక్షల 87వేల ఎకరాల్లో పంటలు సాగవడం గొప్ప విషయమన్నారు. యాసంగిలో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉందని.. కొనుగోలు కేంద్రాల్లో 8 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న వ్యవసాయానుకూల నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల సాగుకు నిరంతర విద్యుత్, సాగు నీటి సౌకర్యం, ఎరువులు, విత్తనాలు అందివ్వడంతో పాటు సాగులో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు ఇప్పించడం ద్వారా వ్యవసాయం పండుగలా మారుతున్నదని తెలిపారు. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు సౌకర్యాలు కల్పిస్తూ.. కడ్తా లే కుండా మద్దతు ధరను కల్పించాలని సూచించారు.
కోత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..
వరి కోత సమయంలో యంత్రాలను వినియోగించే క్రమంలో తీసుకునే జాగ్రత్తలతో రైతులకు ఎక్కువ ప్రయోజనాలుంటాయని మంత్రి చెప్పారు. హార్వెస్టర్ యంత్రంలో ఫ్యాన్ను ఆన్ చేసి కోత మొదలు పెడితే కడ్తా లేకుండా ధాన్యం వస్తుందని వివరించారు. ఈ నియమం తప్పకుండా పాటిస్తే కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ ఉండబోదని వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. ఈ మేరకు అధికారులు కోత సమయంలో క్షేత్ర స్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. తహసీల్దార్ స్థాయిలో హార్వెస్టర్ యంత్రాలను గుర్తించి వారికి కడ్తా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయాలని చెప్పారు. రైతులు ఎవరూ గందరగోళానికి గురికాకుండా టోకెన్ పద్ధతి ప్రకారం ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తప్పకుండా కొవిడ్ 19 నిబంధనలు పాటించాలని తెలిపారు.
మాక్లూర్లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు..
ఏడాది క్రితం జిల్లాలో కరోనా కేసులు బయట పడినప్పుడు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి ప్రశాంత్రెడ్డి కితాబునిచ్చారు. సెకండ్ వేవ్లో కూడా అదే స్ఫూర్తితో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అజాగ్రత్తకు ఆస్కారం లేకుండా కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లా వైద్యశాల, ఏరియా దవాఖానల వారీగా నమోదైన కేసులు, తీసుకున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో గతంలో మాదిరిగా రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని పర్యవేక్షకురాలు డాక్టర్ ప్రతిమారాజ్కు మంత్రి సూచించారు. మార్చి 15 అనంతరం జీజీహెచ్లో చేపట్టిన చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేయగా… బోధన్ దవాఖాన బాధ్యులు వివరాలు చెప్పలేక తడబాటుకు గురవ్వడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్నందున ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో క్వారంటైన్ కేంద్రాన్ని తెరవాలని మంత్రి సూచించారు. మాక్లూర్లోని నర్సింగ్ కళాశాల బిల్డింగ్ను క్వారంటైన్ కేంద్రం కోసం ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బాధ్యతగా హోం క్వారంటైన్లో ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగి కరోనా వ్యాప్తికి కారకులుగా మారొద్దని విన్నవించారు. అలాంటి వారిని కట్టడి చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇవికూడా చదవండి..
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే