చిత్రకూట్ : ఖైదీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హై సెక్యూరిటీ కలిగిన చిత్రకూట్ జైలులో శుక్రవారం చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. అండర్ ట్రయల్ ఖైదీ అన్షుల్ దీక్షిత్ మరో గ్యాంగ్స్టర్ ముఖీమ్ కాలాపై తుపాకితో కాల్పులు జరిపాడు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయాడు. బుల్లెట్లు దూసుకెళ్లిన మరో క్రిమినల్ మీరాజుద్దీన్ తీవ్రగాయాల అనంతరం మృతిచెందాడు. మీరాజుద్దీన్ను మాఫియా డాన్, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ సన్నిహితుడిగా చెబుతారు.
దీక్షిత్ను లొంగిపోవాల్సిందిగా కోరగా వినకుండా పోలీసులపై కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో దీక్షిత్ కూడా చనిపోయాడు. చిత్రకూట్ ఎస్పీ అంకిత్ మిట్టల్ స్పందిస్తూ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. జైలులోకి తుపాకీ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. అన్ని బ్యారక్లను సోదాలు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. ఓ గ్యాంగ్స్టర్ మరో గ్యాంగ్స్టర్ను జైలులో చంపడం ఇది రెండో ఘటన. జూలై 2018లో గ్యాంగ్స్టర్ మున్నా భజరంగీని మరో గ్యాంగ్స్టర్ సునీల్ రతీ భగ్పాట్ జైలులో కాల్చి చంపాడు.