డెహ్రాడూన్: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కూలిపోయింది. దీంతో అందులోని ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారిణి శిఖా సుయల్ తెలిపారు. ఇంటి శిథిలాలు తొలగించి మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు.
మరోవైపు భారీ వర్షం వల్ల జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. శిథిలాల నుండి స్థానిక వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.