సాగులో నాణ్యమైన దిగుబడికి ప్రోత్సాహం
సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్న ‘సెర్ప్’ అధికారులు
పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం
ఇల్లెందు, ముల్కలపల్లి మండలాలు ఎంపిక
ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 2: పల్లెల్లో పొదుపు సంఘాలు ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తున్నది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో సంఘాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. ప్రస్తుతం జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలో 18,400 పొదుపు సంఘాల పరిధిలో 980 గ్రామ సంఘాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 1,79,161 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో సాగుపై ఆసక్తి కలిగి ఉన్న 18- 58 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలను రైతు సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. సంఘంలో చేరే మహిళలు వాటా ధనం కింద రూ.100, సభ్యత్వ రుసుము రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 15 నుంచి 20 మంది సభ్యులతో సంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సెర్ప్ అధికారులు పొదుపు సంఘాలు, జీవనోపాధుల సంఘాలను ఏర్పాటు చేశారు. పొదుపు సంఘాలు పొదుపు చేస్తూ రుణాలు తీసుకుంటున్నాయి. క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నాయి. జీవనోపాధుల సంఘాలు మేకలు, గొర్రెలు, పాడి గేదెలకు రుణం పొంది వాటిని పోషించుకుంటూ తిరిగి రుణాలు చెల్లిస్తున్నాయి. ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు నాణ్యమైన దిగుబడి సాధించి గిట్టుబాటు ధర తీసుకునేలా సెర్ప్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
పనితీరు ఇలా..: రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని కల్తీ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతు, వినియోగదారునికి నష్టం వాటిల్లగా వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేలా మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పని చేయనున్నాయి. సంఘాల్లోని సభ్యులు తాము పండించిన దిగుబడిని విక్రయించుకునేలా అధికారులు రైతువేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి మండలం నుంచి మహిళా రైతు సంఘాల నుంచి ఐదుగురు సభ్యులను ఫార్మర్ ప్రొడ్యూసర్ కమిటీని నియమించారు. వీరు దిగుబడుల వివరాలు సేకరించి సెర్ప్ ప్రతినిధుల ద్వారా దిగుబడుల వివరాలను వ్యాపారస్తులకు చేరవేస్తారు.
ప్రయోగాత్మకంగా రెండు మండలాల్లో..: గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. అధికారులు నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు మండలాలు ఎంపిక చేశారు. ఇల్లెందు మండలంలో 18, ముల్కలపల్లి మండలంలో 51 సంఘాల పనితీరును ప్రభుత్వం పరిశీలించనుంది. ఇప్పటికే వ్యవసాయశాఖ, సెర్ప్ అధికారులు సంఘాల సభ్యులకు ఒక దఫా శిక్షణ ఇచ్చారు. మున్ముందు విత్తనాలు నాటే సమయం నుంచి దిగుబడులు చేతికందే వరకు అధికారులు పనులను పర్యవేక్షించనున్నారు.
మహిళా రైతులకు ప్రోత్సాహం..
ప్రతి గ్రామం నుంచి మహిళా రైతులను ఎంపిక చేసి సంఘటితం చేశాం. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇల్లెందు, ముల్కలపల్లి మండలాల్లో ఈ విధానం అమలవుతున్నది. ఇప్పటికే సంఘాల సభ్యులకు ఇప్పటికే ఒక దఫా శిక్షణ ఇచ్చాం. రానున్న రోజుల్లో సాగుపై మరింత అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకుంటాం. – దుర్గారావు, ఏపీఎం, ఇల్లెందు మండలం
ఇవి కూడా చుడండి
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో పెరుదల
కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్