ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మతుంగ ఏరియాలో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మతుంగ ఏరియాకు చెందిన ఉదయ్ నాడార్ స్థానికంగా ఓ కూరగాయల మడిగను అద్దెకు తీసుకుని వ్యాపారం చేసుకునేవాడు.
బాధితుడు అతని దుకాణంలో జీతానికి పనిచేసేవాడు. అయితే లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో గత కొన్నాళ్లుగా ఆ మడిగలను మూసివుంచారు. ఇటీవల కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి తెరుస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఉదయ్ నాడార్ దగ్గర పనిచేసిన బాధితుడు నేరుగా దుకాణం యజమానితో మాట్లాడుకుని సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇది తెలిసిన ఉదయ్ నాడార్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాధితుడి కూరగాయల దుకాణానికి వెళ్లిన ఉదయ్ నాడార్.. కూరగాయలు కొనేందుకు వచ్చినట్లుగా నటిస్తూ దుకాణం లోపలివరకు వెళ్లాడు. అక్కడి బాధితుడిపై దాడికి పాల్పడ్డాడు. అతని వెంట వచ్చిన బాలకృష్ణ నాడార్ కూడా బాధితుడిపై చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ బాధితుడి కూరగాయల దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ తీసుకెళ్లి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.