స్నేహితులతో కలిసి పని చేసే సంస్థకే కన్నం వేశాడు.. క్యాషియర్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా అదును చూసి దారిదోపిడీ చేసి బ్యాగుతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాం పు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన జక్కుల బాలకృష్ణ అబ్ధుల్లాపూర్మెట్, తుర్కయంజాల గ్రామంలో ఉంటున్నాడు. బాలాపూర్లోని భార్గవి గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం పని చేసే సంస్థకే కన్నం వేయాలని పథకం వేసుకున్నాడు.
ఇందు కు తన స్నేహితులైన సైదాబాద్, పూసలబస్తీకి చెందిన డ్రైవర్ కావేటి శ్రీధర్ అలియాస్ చింటు, సైదాబాద్, పూసలబస్తీకి చెందిన డ్రైవర్ పొడిల రాజు, రాంపల్లికి చెందిన డ్రైవర్ తిప్పబత్తిని అభిషేక్, హబ్సీగూడకు చెందిన డ్రైవర్ పట్టెం రమేశ్ల సహాయం కోరాడు. క్యాషియర్ సైదులు వద్ద డబ్బులు దోచుకోవాలని పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా గత నెల 18న క్యాషియర్ సైదులు నగదు బ్యాగును తీసుకుని బైకు వద్దకు వస్తున్నాడు. అప్పటికే అక్కడి కాచుకుని కూర్చున్న నలుగురు సైదులు చేతిలో ఉన్న నగదు బ్యాగును లాక్కొని పరారయ్యారు. బ్యాగులో ఉన్న రూ. 2, 87, 890 లక్షలను ఐదుగురు పంచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.
కాగా.. గురువారం బాలాపూర్లోని శివాజీ చౌక్ వద్ద ఆ ఐదుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దారిదోపిడీ విషయం బయటపడింది. వారి నుంచి రూ. 1.59 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల విలువైన మూడు బైకులు, రూ. 20 వేల విలువైన మూడు సెల్ఫోన్లు, రూ. 1, 28, 890 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ క్రైమ్స్ శ్రీనివాస్, ఏసీపీ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.