పుణే : రూ లక్ష విలువైన భారత కరెన్సీతో సమానమైన అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్ను రూ 99,000కు ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మోసగించారు. పుణే జిల్లాలోని దత్తవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లొహెగావ్కు చెందిన క్యాబ్ డ్రైవర్ (60)కు డాలర్లు ఇస్తామని నమ్మబలికిన నిందితులు అతడిని రూ 99,000 తీసుకుని నీలయం టాకీస్ బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పారు. భారత కరెన్సీని అందించి రూ లక్ష విలువైన డాలర్లను తెచ్చుకునేందుకు బాధితుడు తన కుమార్తెతో కలిసి వెళ్లాడు.
నిందితులు అందించిన బ్యాగ్ను కొద్దిసేపటి తర్వాత తండ్రీ కూతురు దాన్ని ఓపెన్ చేయగా డాలర్లకు బదులు న్యూస్ పేపర్లు ఉండటంతో కంగుతిన్నారు. బాధితుడు వెంటనే దత్తవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి క్యాబ్లో ఇటీవల నిందితులు ప్రయాణించిన సమయంలో క్యాబ్ డ్రైవర్కు వారు 20 డాలర్ల నోటు అందించారు. డాలర్ను ఫారెన్ ఎక్స్ఛేంజ్ కౌంటర్లో మార్చుకోగా రూ 1400 లభించాయి. బాధితుడిని మోసగించేందుకు నిందితులు ట్రిక్గా దీన్ని ప్రయోగించారు. ఆపై పథకం ప్రకారం డాలర్ల ఆశచూపి బాధితుడిని రూ 99,000కు మోసగించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.