సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర్పుతున్నది. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు రోజు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూస్తున్నది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ శాతం మంది రసాయన రహిత ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి హానికారక రసాయనాలు వినియోగించని, ప్రకృతి సహజసిద్ధంగా పండించిన పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, పాల పదార్థాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పలు రిటైల్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. అసోచామ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సేంద్రియ మార్కెట్ విలువ గతంతో పోల్చితే 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగిందని.. అదేవిధంగా సేంద్రియ ఉత్పత్తులతో ఒనగూరే ప్రయోజనాలపై రోజురోజుకూ సామాన్యుల్లో అవగాహన పెరుగుతున్నదని.. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ సేంద్రియానికి డిమాండ్ ఉందని వెల్లడించడం గమనార్హం. ఇక 2020లో 6.38 లక్షల టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలను ఎగుమతి చేయగా వాటి విలువ రూ.4685.90 కోట్లని ఆ నివేదిక తెలిపింది.
పోషక విలువలు.. రుచి ఎక్కువ..
ఎరువులు, పురుగు మందులు వినియోగించి పండించిన ఉత్పత్తుల్లో హానికర రసాయన అవశేషాలు ఉండడమే గాకుండా అవి దీర్ఘకాలికంగా అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా బీపీ, స్థూలకాయం, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులు రసాయనిక ఆహార పదార్థాలను తినడంతోనే వస్తున్నాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కేంద్రీయ గణాంకాల ప్రకారం రసాయనిక పద్ధతుల ద్వారా పండించిన పంటల్లో 77 శాతం హానికారక అవశేషాలు ఉంటుండగా, సహజ పద్ధతులతో పాటు సేంద్రియ ఎరువులతో ఉత్పత్తి చేసిన ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల్లో కేవలం 25 శాతమే అవశేషాలు ఉంటున్నాయని తేలింది. అదీగాక రసాయన ఉత్పత్తుల్లో పోషక విలువలు సైతం స్వల్పమేనని, రుచి కూడా ఉండని పరిస్థితి. ఇందుకు భిన్నంగా ఆర్గానిక్ పంట ఉత్పత్తులు ఇటు ఎక్కువ రుచి, అటు అధిక పోషక విలువలతో కూడుకుని ఉంటున్నాయని.. ఇప్పటికే అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
పెరుగుతున్న అమ్మకాలు..
సేంద్రియ ఆహార పదార్థాలపై సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బియ్యం, పండ్లు, కూరగాయాలు, పప్పుదినులు, మూలికలు, పానీయాలు, అశ్వగంథ క్యాప్సూల్స్కు డిమాండ్ ఏర్పడింది. కేవలం న్యాచురల్ తేనే అమ్మకాలే గతంతో పోల్చితే 60 శాతం మేర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.
ధర ఎక్కువ.. లభ్యత తక్కువ..
రసాయనాలతో ఉత్పత్తి చేసిన పంటలతో పోల్చితే ఆర్గానిక్ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగానే పలుకుతున్నది. అదీగాక కొద్దిమంది రైతులు మాత్రమే సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తుండడంతో ఈ ఉత్పత్తుల లభ్యత కూడా తక్కువే. ఈ నేపథ్యంలో చాలా మంది ఆ ఉత్పత్తులను వాడేందుకు వెనకంజ వేసేవారు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులోకి వచ్చిన ఈ- కామర్స్ విధానంతో ఉత్పత్తుల లభ్యత పెరిగింది. అంతేకాక ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో వ్యక్తిగత ఆరోగ్యం, రోగనిరోధక శక్తిపై పెరిగిన అవగాహనతో సేంద్రియ ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఏర్పడింది. చాలా మంది సామాన్యులు సైతం ధర ఎక్కువగా ఉన్నా సేంద్రియ ఉత్పత్తుల వైపునకే మొగ్గుచూపుతున్నారు.