చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘నీట్’పై భయాందోళనతో తమిళనాడులో మరో ఆత్మహత్య వెలుగుచూసింది. ఈ నెల 12న నీట్ పరీక్ష రాసిన 17 ఏండ్ల టీ సౌందర్య, ఈ పరీక్షలో అర్హత సాధిస్తానో లేదో అన్న భయంతో బుధవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నది. పేపర్ కఠినంగా ఉన్నదని, తాను బాగా రాయలేదని నీట్ అనంతరం తన పేరెంట్స్కు ఆమె చెప్పినట్లు తెలుస్తున్నది. నాటి నుంచి మానసిక ఆందోళనతో ఉన్న ఆ బాలిక బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.
దీనికి ముందు న్యాయవాద దంపతుల కుమార్తె కనిమొళి కూడా నీట్లో అర్హత సాధించలేనన్న భయంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నది. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలం సమీపంలోని మెట్టూరులో 19 ఏండ్ల ధనుష్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు రెండు సార్లు హాజరైన అతడు అర్హత సాధించలేకపోయాడు. ఈసారి కూడా పాస్ కాలేమోనన్న ఆందోళనతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో నీట్పై భయంతో తమిళనాడులో నాలుగు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇంటర్ మార్కుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలని అందులో పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల చట్టం -2021కి తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అయితే రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.