హైదరాబాద్ : లింగంపల్లిలోని ఓ గోల్డ్ షాపులో చోరీ జరిగిన విషయం విదితమే. ఈ చోరీకి పాల్పడిన దొంగను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి మూడున్నర తులాల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు, నాలుగు కార్లతో పాటు రూ. 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. చందానగర్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును చేధించారు అని పేర్కొన్నారు. పేరు మోసిన గజదొంగ సయ్యద్ మహమ్మద్ పాషా అలియాస్ బిర్యానీ పాషాను అరెస్టు చేశామని తెలిపారు. బిర్యానీ పాషా 2010 నుంచి దొంగతనాలు పాల్పడుతున్నాడు. ఇప్పటికే 15 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. ఈ దొంగపై పీడియాక్ట్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2019లో జైలు నుంచి విడుదలయ్యాక.. నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 13 చోరీలు చేశాడని తెలిపారు.