హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు వేస్తున్న అన్ని టీకాలు సురక్షితమేనని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. ప్రజల్లో కొవిడ్ టీకాల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ జనాభాలో 55.5% మందిలో కొవిడ్ ప్రతిరక్షకాలు ఏర్పడ్డాయని, దీంతో సమూహవ్యాప్తి నిరోధకతకు దగ్గరల్లో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్లో శనివారం జరిగిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆరో వార్షిక సదస్సులో మిశ్రా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాలో 60 నుంచి 90 శాతం మంది వైరస్ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధిస్తే సామూహిక రోగనిరోధకత శక్తి సాధించినట్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్లో మరో 6% మందిలో ప్రతిరక్షకాలు ఏర్పడితే ఇక్కడ కూడా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లేనని తెలిపారు. కొవిడ్ తొలి టీకా వేసుకున్న నాటి నుంచే 20 నుంచి 30 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నట్టు పరిశోధనల్లో తేలిందని చెప్పారు. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తరువాత ప్రతిరక్షకాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతాయని తెలిపారు. సమూహవ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. టీకాలు వేసుకోవడంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, అన్ని టీకాలు సురక్షితమేనని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ పరిస్థితి ఇక్కడ రావొద్దంటే మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పకుండా చేయాలన్నారు.
కార్డియాలజీ వైద్యంలో అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలపై పరస్పరం సహకరించుకోవడంతోపాటు ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనల పురోగతి గురించి తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని రాకేశ్ మిశ్రా చెప్పారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన తర్వాత దేశంలో అనేక పరిశోధనా సంస్థలు కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని, వైరస్ను విశ్లేషించడంతోపాటు టీకా తయారీలో సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సులో సొసైటీ అధ్యక్షుడు కేఎంకే రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్గార్గ్, ప్రముఖ వైద్యుడు డాక్టర్లు గోపీచంద్ సహా పలువురు వైద్యులు ప్రత్యక్షంగా, వర్చువల్గా పాల్గొన్నారు. డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి వర్చువల్గా ప్రసంగించారు. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సులో గుండె వ్యాధులకు సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో.. కార్డియాలజీ చికిత్సలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ సుధీర్నాయక్, డాక్టర్ సోమరాజు, డాక్టర్ గోపీచందర్ మన్నెంకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలను అందజేశారు.