కంటోన్మెంట్/హైదరాబాద్ : పక్కింట్లో రొట్టెలు ఇచ్చి వస్తానని వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం ఔరాద్ తాలూక భాల్కి గ్రామానికి చెందిన ప్రదీప్ గౌక్వాడ్ సమీప గ్రామానికి చెందిన మనీషా(25)ను గత రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
అప్పటినుంచి ఈ దంపతులు ఓల్డ్ బోయిన్పల్లి వల్లభ్నగర్లోని టైల్స్ గోదామువద్ద నివాసముంటున్నారు. ప్రదీప్ టైల్స్ పని చేస్తుండగా, మనీషా ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ఆర్నగర్లోని కార్టూన్ బాక్సు కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మనీషా ఆ పక్కింటివారికి రొట్టెలు ఇచ్చి వస్తానని భర్తతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. బంధువులు, తెలిసినవారిని ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో ప్రదీప్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.