రంగారెడ్డి : నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని కులకచర్ల మండలం ఘనపూర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వార్ల నర్సింహులుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య సాయమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండో భార్య ఎల్లమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పొలం దగ్గరే రేకుల షెడ్డు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.
పొలానికి నీళ్లు పారించేందుకు పొలం వద్ద ఓ గుంతను తవ్వారు. కాగా, పెద్ద భార్య సాయమ్మ మద్యం మత్తులో గుంతలో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు కర్రె బీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.