జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య కండ్లలో కారం చల్లి రోకలిబండతో బాది దారుణంగా హతమార్చింది. ఈ విషాదకర సంఘటన మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాచర్ల రాజయ్య( 55) రాజక్క భార్యభర్తలు. కాగా కుటుంబ కలహాలతో గత 16 సంవత్సరాలుగా గ్రామంలో వేర్వేరుగా ఉంటున్నారు. రాజయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శనివారం సాయంత్రం రోడ్డుపై భార్యాభర్తలకు చిన్న ఘర్షణ జరగడంతో ఆదివారం ఉదయం బయటికి వెళ్తున్న రాజయ్య పై భార్య రాజక్క కళ్లలో కారంపొడి చల్లి.. రోకలిబండతో తలపై బాదడంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ బోనాల కిషన్, ఎస్సైలు రంజిత్ రావు, సత్యనారాయణ పరిశీలించారు. భార్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.