ఖమ్మం : ఆ చెట్టు ఎన్నో ఏండ్లుగా ఎంతో మందికి చల్లని నీడనిచ్చింది. తల్లిలా అక్కున చేర్చుకొని ఎందరినో తన ఒడిలో సేదర్చింది. పిల్లల ఆట పాటలకు నిలయంగా మారి వినోదాల్ని పంచించింది. ఇన్నాళ్లు చల్లని నీడనిచ్చిన ఆ మహావృక్షం నేడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఎప్పటిలాగే ఆ చెట్టు నీడలో సరదగా క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ హృదయవిదారక సంఘటన మంగళవారం ఖమ్మం నగరంలోని బ్రహ్మణ బజారులో చోటు చేసుకుంది.
రావి చెట్టు విరిగి పడటంతో క్రికెట్ ఆడుతున్న ఆయూష్(8), జితేందర్(12) ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వారి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల మృతితో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.