యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు వెండితెర, అటు బుల్లితెరపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు అనే బుల్లితెర కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా విడుదల తర్వాత తన 30వ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలోనా లేదంటే కొరటాల శివ, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుందా అనే సస్పెన్స్ అందరిలో నెలకొంది.
ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ రోజు సాయంత్రం 7.02ని.లకు రానుందని మేకర్స్ తెలియజేశారు. ఈ ప్రకటనతో అభిమానుల ఆనందం అవధులు దాటడం ఖాయం. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తర్వాత మళ్లీ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో బుల్లితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కొన్నాళ్లుగా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తూ ప్రోగ్రాంపై ఆసక్తి పెంచుతున్న నిర్వాహకులు వచ్చే నెలలో షో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.