సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో పలు వస్తువులు చోరికి గురయ్యాయి. ఈ మేరకు విభాగంలోని రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళడం బుధవారం దవాఖానలో కల కలం రేపింది. ఈ విషయమై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వ కంగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న డీఐ ప్రవీణ్కుమార్ దర్యాప్తును చేపడుతున్నారు.
కాగా పోలీసులు, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం శిథిలావస్థకు చేరుకున్న పాతభవనంలోని వార్డులను,శస్త్ర చికిత్సా విభాగాలను ఓపీ, కులీకుతుబ్షా భవనంలోకి మార్చడం జరిగింది, ఐతే పాత భవనంలోని మొదటి అంతస్థులో ఆర్థోపెడిక్ విభాగాధిపతి కార్యాలయంతో పాటు ప్రొఫెసర్ల గదులు, సెమినార్ హాల్లు కొనసాగుతున్నాయి. ఆర్థోపెడిక్ విభాగంలోని మూడు యూనిట్లలోని సర్వీసు పీజీలు,రెగ్యులర్ పీజీలతో పాటు హౌస్ సర్జన్లు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
ఇదిలా ఉండగా బూత్బంగ్లాను తలపిస్తున్న పాత భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న విభాగం పక్కనే ఉన్న సెమినార్ హాలులో నుండి రెండు కంప్యూటర్లు, మానిటర్లు, యూపీఎస్లు, ప్రొజెక్టర్లు చోరికి గురయ్యాయి,అంతే కాకుండా ఆర్థోపెడిక్ విభాగాధిపతి కార్యాలయంలో అమర్చిన ఏసీ యంత్రాలకు చెందిన నాలుగు కంప్రెషర్లు,విడి భాగాలు చోరీ అయ్యాయని వివరించారు. ఇదిలా ఉండగా పాత భవనంలో ఎస్పీఎఫ్ పోలీసులకు వసతి సౌకర్యం ఉండగా, పోలీస్ ఔట్ పోస్టు, పోలీస్ స్టేషన్ దవాఖాన ఆవరణలో ఉన్నప్పటికి దవాఖానలో యదేచ్చగా చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం