వికారాబాద్ : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ వ్యక్తి బైక్తో సహా గళ్లంతైన సంఘటన ఆదివారం పులుమామిడిలో చోటు చేసుకుంది. నవాబుపేట ఎస్సై వెంకటేశం, స్థానికులు తెలిపిన విరవాల ప్రకారం.. నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన చాకలి శ్రీను (40) వ్యవసాయ పనులతో పాటు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం సంగారెడ్డిలో బంధువుల అంత్యక్రియలకు భార్యతో బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామంలోని హనుమాన్ దేవాలయం పక్కన వాగు ఉదృతంగా పారుతుంది. శ్రీను తన భార్య నాగమణిని బైక్పై నుంచి దింపి వాగు దాటే ప్రయత్నం చేశాడు. భారీ ఎత్తున వరద నీరు రావడంతో బైక్తో పాటు శ్రీను కొట్టుకపోయాడు. శ్రీనుకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య నాగరాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. శీను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వాగు పులుమామిడి నుంచి నవాబుపేట మండలం గంగ్యాడ సమీపంలో ఉన్న మూసి నదిలో కలుస్తుంది.