జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను వృథా చేయొద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లాలోని గొల్లబుద్ధారం జీపీ పరిధిలోని భీంఘన్పూర్ రిజర్వాయర్ కట్ట, మత్తడి, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపుహౌస్, గణపురం మండలంలోని గణపసముద్రం చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జిల్లాలోని చెరువులను నింపి సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కలలను నిజం చేయాలన్నారు. రూ.30కోట్లతో జరుగుతున్న పనులను నాణ్యతతో, కొద్దిపాటి మార్పులతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 5వేల ఎకరాలకు సాగునీరు అందించేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఇదిమొత్తం పూర్తయితే సుమారు 20వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. నిధుల కొరత ఉంటే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులకు సూచించారు.
భీంఘన్పూర్ రిజర్వాయర్ కట్ట, మత్తడిని పటిష్టంగా నిర్మించాలన్నారు. గత వర్షాకాలంలో రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగడం వల్ల మత్తడిని కొంతభాగం తొలగించినట్లు చెప్పారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేపడుతున్న పంపుహౌస్, కాల్వల పనుల పురోగతిని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇష్టమొచ్చినట్లు నాణ్యత లేకుండా పనులు చేస్తే ప్రభుత్వానికి చెడుపేరు వస్తుందని, చేసే ప్రతి పనిలో జవాబుదారీతనం ఉండాలన్నారు. అనంతరం గణపురం మండలంలోని గణపసముద్రం చెరువును పరిశీలించారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, ఎస్ఐ అభినవ్ ఆధ్వర్యంలో బారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ విజయభాస్కర్, ఎస్ఈ సుధీర్, ఈఈ వెంకటరమణ, డీఈ బసవప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్నాయక్, యూత్ అధ్యక్షుడు రఘుపతి, నాయకులు సెగ్గెం సిద్ధు, విద్యాసాగర్రెడ్డి, పీఎస్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.