కూలీల కొరత తీరిందంటున్న రైతులు
తక్కువ సమయంలో ఎక్కువ పనులు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
కొందుర్గు, మే 9: పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకర ణ వైపు దృష్టి సారించారు. ఈ యాసంగి సీజన్లో వరిని దాదాపు కోత యం త్రాలతోనే (హార్వెస్టర్లు) కోసినట్లు చాలా మంది రైతులు చెబుతున్నారు. దీంతో పనులు త్వరగా పూర్తి అవుతున్నాయని, కూలీల ఇబ్బంది కూడా తప్పిందని వారు తెలిపారు. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున పంటను కాపాడుకోవాలంటే ఇదే మంచి మార్గమని వారు భావిస్తున్నారు. ఈ సీజన్లో చిన్న, సన్నకారు రైతులు కూడా ఈ యంత్రాల సహాయంతో వరి కోతలు కోసినట్లు తెలిపారు. వరి సాగు చేసే రైతులు ట్రాక్టర్లు, కోత యంత్రాల సహాయాన్ని తీసుకుంటున్నారు. కూలీల ఖర్చుతో పోలిస్తే యంత్రాలతోనే వ్యవసాయం సులువుగా ఉంటుందంటున్నారు.
యంత్రాలతో సులువుగా పనులు
కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో వరి, పత్తి పంటలు ఎక్కువ శాతం సాగుచేస్తారు. కొందుర్గు మండలంలో అన్ని గ్రామాల్లో ప్రస్తుతం యాసంగిలో 5,500 ఎకరాల వరి సాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ తెలిపారు. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో 4,900 ఎకరాల వరి సాగు చేశారని ఆయన చెప్పారు. వరి సాగు చేసే రైతులు నాట్లు వేసే సమయంలో మాత్రమే కూలీలతో పనులు చేయించుకుంటారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట కోత సమయంలో రైతులు కోత యంత్రాలు వాడుతున్నారు. ఈ యంత్రాలతో ఎకరాకు రూ.2వేల నుంచి రూ.2500 వరకు ఖర్చు అవుతుంది. ఎకరా పొలంలో కూలీలతో వరి పంట తీస్తే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.
కూలీల ఇబ్బందులు తగ్గాయి..
వరికోత యంత్రాలు రావడం వల్ల కూలీల ఇబ్బందులు తగ్గాయి. పంట కోసే సమయంలో కూలీలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండేది. ఒకేసారి గ్రామంలో రైతుల పంటలు కోతకు రావడం వల్ల కూలీల కొరత ఏర్పడేది. యంత్రాలు రావడంతో చాలా సులువుగా వరి పంట కోసుకుని ధాన్నాన్ని ఇండ్లకు తీసుకొస్తున్నాం.
– చిన్నయ్య, రైతు, జిల్లెడు గ్రామం
వరికోత మిషన్లతో రైతులకు మేలు
గ్రామాల్లో వరి సాగు చేసే రైతులకు కోత మిషన్లు ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రస్తుత యాసంగి పంటలు సకాలంలో కోత కోసుకోవాలంటే అకాల వర్షాలతో ఇబ్బందులు ఉంటాయి. కోత మిషన్లు ఉండడం వల్ల కొద్ది పాటి సమయంలోనే పంట చేతికొస్తుంది. రైతులు వాతావరణాన్ని చూసుకుని పంటలు కోసుకోవాలి.
మధుసూదన్, వ్యవసాయ అధికారి, కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ