సరిపడా మందులున్నాయి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స కోసం పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత లేదని, మందులు అందుబాటులో ఉన్నాయని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కరోనాపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, వైరస్ను ఎదుర్కొనేందుకు చికిత్స కన్నా ధైర్యమే మందు అని చెప్పారు. శుక్రవారం ఆయన జడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మందులు, పడకల కొరత ఏ మాత్రం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 100 ఆక్సిజన్ బెడ్లు, మరో 100 వెంటిలేటర్ బెడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లా దవాఖానలో 50 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనాను పూర్తిగా నియంత్రించడంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ను విధించారని, ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం నేరుగా సమీక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో నంబర్-1గా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 80శాతానికి పైగా ఫీవర్ సర్వే పూర్తయిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందిస్తున్న వైద్య, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మీడియా సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.