వెంగళరావునగర్ : లిఫ్ట్ డోరు తెరుచుకుని మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం..ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉండే అమ్మాన నిలయంలో నివసించే ఎం.సుబ్బారావు (39) ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న తన మిత్రులైన సురేష్, నాగరాజులతో కలిసి ఎస్.ఆర్ నగర్ ఉమేశ్చంద్ర కూడలి సమీపంలో ఉన్న నందిని బార్కు వెళ్లాడు.
బార్ నుంచి బయటకు వచ్చి కిందకు రావడం కోసం మూడో అంతస్థులో ఉన్న లిఫ్ట్డోర్ తీశాడు. కాగా లిఫ్ట్ రాకున్న తలుపు తెరుచుకోవడంతో లోనికి కాలుపెట్టి లిఫ్ట్గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 ఆంబులెన్స్ ద్వారా అమీర్పేటలోని ఆస్టర్ ప్రైం దవాఖానాకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి సోమాజిగూడలోని యశోద దవాఖానాకు మార్చారు.
ఈ నెల 25న సనత్ నగర్లోని ఈఎస్ఐ దవాఖానాలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సుబ్బారావు మృతి చెందారు. సుబ్బారావు మృతి పై అనుమానాలున్నాయని ఆయన సోదరి జ్యోతి శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.