వెంగళరావునగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై దవాఖానాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందే వారి సమాచారంతో పాటు మృతి చెందిన వారి సమాచారాన్ని పోలీసులకు సంబందిత దవాఖానా సిబ్బంది తెలియపరచాల్సి ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మృతి చెందిన రెండు నెలలకు కేసు నమోదైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..అమీర్పేటలోని ఎంసీహెచ్ మార్కెట్ సమీపంలో నివాసం ఉండే ఎ.సురేందర్ (62) సనత్నగర్ లోని కాలుష్య నియంత్రణా మండలిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జులై 8న సనత్ నగర్ స్వామి టాకీస్ నుంచి తన స్కూటర్ పై అమీర్పేటలోని తన ఇంటికి వెళ్తూ మరో ద్వీచక్ర వాహనదారుడు ఢీ కొనడంతో గాయాలపాలై రోడ్డ పై పడిపోయాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన గాయపడిన సురేందర్ను 108 అంబులెన్స్లో సనత్ నగర్ ఈఎస్ఐ దవాఖానాకు తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం దవాఖానా వైద్యుల సూచన మేరకు శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ దవాఖానాకు తరలించారు. కాగా ఈఎస్ఐ వైద్యులు ఎంఎల్సీ కేసుగా ఎస్.ఆర్.నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. నిఖిల్ దవాఖానాలో చికిత్స పొందిన సురేందర్ పరిస్థితి విషమించడంతో జులై 16న మృతి చెందాడు. ఈ దవాఖానా సిబ్బంది కుడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అనంతరం కుటుంబ సభ్యులు సురేందర్కు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. తొలుత సురేందర్ కిందపడి గాయపడి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కొద్ది రోజులకు తమ తండ్రి వేరొక ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడని స్థానికుల ద్వారా తెలుసుకున్న కుమారుడు ధీరజ్ ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందిన రెండు నెలలకు ఫిర్యాదు రావడంతో గురువారం కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో కిందపడి గాయపడినప్పటికీ చికిత్స అందించే దవాఖానాలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందేనని, ఈ సంఘటనలో అలా జరగలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు.