ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండి 23.140 కిలోల గంజాయి, టాటా జెస్ట్ వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. గంజాయి తరలింపునకు ప్రధాన సూత్రదారిగా ఉన్న కిట్టు అలియాస్ శ్రీనివాస్ పరారీలో ఉండగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం కొవడ గ్రామానికి చెందిన కుంచినిపల్లి వీరబాబు( 28), విశాఖపట్నం జిల్లా మాకవానిపాలెం గ్రామానికి చెందిన రత్తుల శ్రీనివాసరావు (38)లకు పరిచయం ఉంది. వీరు విలాసవంతంగా జీవించేం దుకు కిట్టు అలియాస్ శ్రీనివాసును కలిశారు. కిట్టు రాజమండ్రి నుండి హైదరాబాద్కు గంజాయిని సరఫరా చేస్తుంటాడు. తాము హైదరాబాద్లో ఎక్కువ ధరకు గంజాయిని సరఫరా చేస్తామంటూ కిట్టుతో ఒప్పందానికి వచ్చారు.
రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వస్తూ ప్రయాణీకుల కోసం టాటా జెస్ట్ ట్రాన్స్పోర్టు వాహనంతో ఉన్నరంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్కు చెందిన కార్ డ్రైవర్ బొమ్మగల్ల సురేష్ (24)తో ఒప్పందం చేసుకుని గంజాయిని తీసుకుని నగరానికి వచ్చారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు కొత్తపేట బీజేఆర్ భవన్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టు బడింది. ఈ మేరకు కేసును ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో చైతన్యపురి సీఐ రవికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగేశ్వర్రావులు దర్యప్తు చేస్తున్నారు.