అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్లో రాయితీ వరి విత్తనాల పంపిణీకి జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) సెంటర్ల ద్వారా రైతన్నలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ ప్రారంభించారు. ఖరీఫ్ కోసం 2.37 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లాల్లో కిలోకి రూ.10 సబ్సిడీ, నాన్ ఎన్ఎఫ్ఎంఎస్ జిల్లాల్లో కిలోకి రూ.5 సబ్సిడీ, గిరిజన ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై వరి వంగడాలు పంపిణీ చేస్తున్నారు. విత్తనాలకోసం డి.క్రిష్ యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకుంటున్నారు. కాగా, ఏపీలో మొత్తంగా 13 రకాల వరి వంగడాలనే సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది.
గతేడాది రాష్ట్రంలో 39.54 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, ఈ ఏడాది 41.20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారులకు మాత్రమే వరి వంగడాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు.రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రోజే సబ్సిడీ పోను మిగిలిన నగదు మొత్తాన్ని తీసుకుంటున్నారు. పంపిణీకి ముందు వాటి నాణ్యతను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ), మండల వ్యవసాయాధికారి (ఎంఏవో), వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ)లు పరీక్షించనున్నారు.