పహాడీషరీఫ్ : మదర్సాలో చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం బీహార్కు చెందిన మహ్మద్ నవాజ్(14)తో పాటు అతని ఇద్దరు అన్నలు గత 7 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి కమాన్రోడ్డులో ఉన్న నూర్ హుల్ హుదా మదర్సాలో ఉంటున్నారు. నవాజ్ చదువుకుంటుండగా ఇద్దరు అన్నదమ్ములు అందులో ఉపాధ్యా యులుగా పని చేస్తున్నారు.
కాగా 19న ఉదయం 9 గంటలకు నవాజ్ మదర్సాలో సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లాడు. మదర్సాలో లేకపోయే సరికి 11 గంటలకు అతని కోసం వెతుకుతుండగా మదర్సా వెనక వైపు వెళ్లాడని స్థానికులు చెప్పడంతో అక్కడ వెతకగా నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు నైలాన్ తాడుతో ఉరేసుకుని మృతి చెంది కనిపించాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి అన్న ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.