రంగారెడ్డి జిల్లా కోర్టులు : మాయ మాటలతో మైనర్ బాలికను మభ్యపెట్టి ముంబాయి తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకొని శారీరకంగా లొంగదీసుకున్న వ్యక్తికి పడేండ్ల జైలు శిక్ష పడింది. నిందితుడు కావలి రాజుకు రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసాన్పల్లికి చెందిన బాలిక తండ్రి వద్ద కావలి రాజు పని చేసేవాడు. ఈ క్రమంలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న రాజు ప్రేమ పేరుతో ఆక్టోబర్ 2012 లో బాలికను ముంబాయికి తీసుకెళ్ళాడు.
బాలికను పెళ్ళి చేసుకుని, భార్యభర్తలమని చెప్పి బాలికతో కాపురం చేశాడు. సుమారు 8 నెలలు తరువాత రాజు బాలికను వారి సొంత గ్రామానికి తీసుకువెలుతున్నానని తీసుకు వచ్చి ధారూర్ బస్టాండ్ సమీపంలో విడిచిపెట్టి పోయాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చిన బాలిక వారితో కలసి ధారూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. సాక్షాదారాలను పరీశీలించిన న్యాయస్థానం నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.