బెంగళూర్ : తనను నిర్లక్ష్యం చేస్తూ ఇతర బాలురతో మాట్లాడుతోందనే ఆగ్రహంతో బాలిక(15)ను గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించిన బాలుడి ఉదంతం బెంగళూర్లోని జయానగర్లో ఈనెల 13న వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయానగర్కు చెందిన కరిష్మా (పేరు మార్చాం) అదే ప్రాంతానికి చెందిన అన్మోల్లు గత కొన్నేండ్లుగా కలిసి చదువుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కరిష్మా ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన అన్మోల్ ఆమె ఇంటికి వచ్చాడు.
తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని ఆమెను ప్రశ్నిస్తూ ఇతర బాలురతో ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఆపై కత్తితో ఆమె గొంతు కోసి టాయ్లెట్ క్లీనర్ను ఆమెతో తాగించడంతో పాటు తాను కూడా తాగాడని బాలిక తల్లి తెలిపారు. ఇద్దరూ రక్తపు మడుగులో ఉండటంతో భయపడిన అన్మోల్ తన మామకు ఫోన్ చేసి పరిస్థితి తెలపడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఆయన ఇద్దరినీ దవాఖానకు తరలించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో దవాఖానకు చేరుకున్న పోలీసులు కరిష్మా స్టేట్మెంట్ను రికార్డు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.