హైదరాబాద్ : స్నేహితుడిని కావాలనే బావిలోకి నెట్టేసి.. ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయినట్లుగా చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నగరంలోని గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్కు చెందిన ఆటో ట్రాలీ డ్రైవర్ మహ్మద్ ఇర్ఫాన్ (19), గోల్కొండలోని రిసాలా బజార్కు చెందిన మొహద్ అజ్జు అలీ (21) తో కలిసి మే 10 న గోల్కొండ ప్రాంతంలోని కుతుబ్షాహి మసీదు అత్తరాసిడి వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇర్ఫాన్ అజ్జును బావిలోకి తోసేశాడు. అజ్జుకు ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయాడు.
మరుసటిరోజు సాయంత్రం గోల్కోండ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిగా విచారణ చేపట్టారు. అయితే అజ్జు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని చూపించడంతో అది తమ కుమారుడిదిగానే గుర్తించారు. మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ విషయంలో ఇర్ఫాన్, అజ్జుకు మధ్య వివాదం ఉందని ఇది హత్యకు దారితీసిందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.