బెంగళూర్ : ఆర్థిక వ్యవహారాలపై ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బెంగళూర్కు చెందిన 38 ఏండ్ల స్కూల్ టీచర్కు సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ లక్షకు టోకరా వేశారు. 1947లో ముద్రించిన ఒక రూపాయి పాత నాణేన్ని ఆన్లైన్ మార్కెటింగ్ వేదికపై విక్రయించే క్రమంలో ఆమె భారీ మొత్తం మోసపోయారు. కైకొండ్రహళ్లికి చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ శాంత జూన్ 9న సైబర్ క్రైమ్ , చీటింగ్ కేసుతో వైట్ఫీల్డ్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పాత నాణేల అమ్మకం ద్వారా రూ లక్షలు సంపాదించే అవకాశం ఉందని తన మైనర్ కుమార్తె ఓ వార్తా పత్రికలో చదివిందని, తన వద్ద 1947 నాటి పాత రూపాయి నాణెం ఉన్నట్టు ఆమెకు తెలుసునని బాధితురాలు తాను మోసపోయిన తీరును వివరించారు.
ఈ నాణేన్ని రూ పది లక్షలకు అమ్ముతామని వారు ఓ ఆన్లైన్ మార్కెటింగ్ వేదికపై కాయిన్ను అప్లోడ్ చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఓ అజ్ఞాత వ్యక్తి పాత రూపాయి నాణేన్ని రూ కోటికి కొనుగోలు చేస్తానని ముందుకొచ్చాడు. తాను డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తానని తన గుర్తింపు కార్డు, బ్యాంకు వివరాలను తీసుకున్నాడని బాధితురాలు వివరించారు. అతడు అకనాలెడ్జ్మెంట్ స్క్రీన్షాట్ పంపాడని చెప్పారు. తన బ్యాంకు ఖాతాలో డబ్బు వేసేందుకు అతడు సిద్ధమయ్యాడని నమ్మి తాను నాణేన్ని విక్రయించేందుకు అంగీకరించానని ఆమె తెలిపారు. ఆ తర్వాత అతడు ప్రాసెసింగ్ ఫీజు, స్విఫ్ట్ కోడ్ చార్జ్, ఆర్బీఐ చార్జ్, ఆదాయపన్ను పేరుతో డబ్బు కోరగా ఇతరుల సాయంతో నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ 1,00,600 నిందితుడి ఖాతాకు పంపానని బాధితురాలు చెప్పుకొచ్చారు.
ఇక మరో వ్యక్తి బ్యాంక్ ఉద్యోగిగా తనను సంప్రదించాడని తన నుంచి మూడు ఖాతాల్లో డబ్బులు వేయించుకున్నారని చెప్పారు. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత తన ఖాతాలో వారు చెప్పిన మొత్తం జమకాలేదని, నాణెం కొనుగోలు చేస్తామన్న నిందితుడు ఫోన్లో అందుబాటులోకి రాలేదని ఆమె వాపోయారు. శాంతతో వారు మాట్లాడిన మొబైల్ నెంబర్లను ట్రేస్ చేయడంతో పాటు నిందితులు ఇచ్చిన బ్యాంకు ఖాతాల ఆధారంగా వారిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.