TCS and Infosys | దేశమంతా బొగ్గు సరఫరాలో సమస్యలతో కొన్నినగరాల్లో విద్యుత్ కోతలకు దారి తీస్తున్నది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశీయ ఐటీ దిగ్గజాలు దృష్టిని కేంద్రీకరించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశాయి. కీలక ప్రాజెక్టులను చేపడుతున్న సమయంలో అంతరాయం కలుగకుండా పవర్ బ్యాకప్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని అభ్యర్థించాయి. బొగ్గుకొరత వార్తలు దేశీయ, అంతర్జాతీయ మీడియాల్లో పతాక శీర్షికలకెక్కడంతో క్లయింట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లోడ్ షెడ్డింగ్ కొనసాగిస్తామని ముందస్తు హెచ్చరికలు జారీచేస్తే, సిబ్బంది.. పవర్ బ్యాకప్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని తమ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఈ-మెయిల్స్ పంపాయి.
గతేడాది మార్చి నుంచి 90 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్.. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారు.మరోవైపు కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సరిపడా బొగ్గు సరఫరా చేయడానికి చర్యలు ముమ్మరం చేసింది, కొద్ది రోజులుగా పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రోజులుగా లోడ్ షెడ్డింగ్ పనులు పునరుద్ధరిస్తున్నాయి. కేంద్ర విద్యుత్శాఖ కార్యదర్శి అలోక్కుమార్ స్పందిస్తూ బొగ్గు కొరతవల్ల విద్యుత్ ఉత్పత్తి జరుగడం లేదన్న వార్తలను తోసిపుచ్చారు.