హైదరాబాద్ : మరికాసేపట్లో తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు లాక్డౌన్పై చర్చించనున్నారు.
కొన్ని రాష్ర్టాల్లో లాక్డౌన్ విధించినా కరోనా అంతగా తగ్గటం లేదని, సరైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు లాక్డౌన్ కావాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధించటం వల్ల కలిగే సాధకబాధకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై లాక్డౌన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించనప్పటికీ.. పలు రాష్ర్టాలు ఇప్పటికే పూర్తిస్థాయి లాక్డౌన్నుగానీ, లాక్డౌన్ తరహా ఆంక్షలనుగానీ విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ కొంతకాలంగా పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలుపరుస్తున్నాయి. ఈ రాష్ర్టాల్లో దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. మహారాష్ట్రలో ఏప్రిల్ 22న లాక్డౌన్ తరహాలో కఠినమైన ఆంక్షలను ప్రకటించగా.. అనంతరం వాటిని ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలకు ముందు రోజైన ఏప్రిల్ 21న 67,468 కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్కరోజు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 568. ఆంక్షలను విధించి సోమవారానికి దాదాపు మూడు వారాలు కావస్తున్నది. సోమవారం కొత్త కరోనా కేసుల సంఖ్య 37,236గా నమోదైంది. మరణాలు కూడా ఆది, సోమవారాలు కలిపి 302 అని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో గత నెల 19 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నది. దానికి ముందు రోజు 24,852 కేసులు నమోదుకాగా.. సోమవారం ఢిల్లీలో 12,651 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో కేసులు తగ్గినప్పటికీ మరణాలు పెరిగాయి.