అమరావతి, జూన్ 15:మావోయిస్టులకు నగదు తరలిస్తున్న సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీగా నగదు పట్టుబడింది. బీడీ కాంట్రాక్టర్ల నుంచి కుంట, కిష్టారం ఏరియా కమిటీ మావోయిస్టులకు నగదు తరలిస్తుండగా పోలీసులకు దొరికింది. ఈ సొమ్మును తరలిస్తున్న మావోయిస్టు సానుభూతి పరులను చింతూరు మండలం గొర్లగూడెం వద్ద అరెస్ట్ చేసి పోలీసులు ఆనగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తం విలువ రూ.9.93 లక్షలు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి నుంచి నగదుతోపాటు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు.