న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడం ఊరట కలిగిస్తోంది. ఏప్రిల్ 22న 36 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా 14.24 శాతానికి దిగిరావడం మహమ్మారి నియంత్రణపై ఆశలు పెంచుతోంది. మరోవైపు ఢిల్లీలో ఆక్సిజన్ డిమాండ్ సైతం రోజుకు 700 మెట్రిక్ టన్నుల నుంచి 582 మెట్రిక్ టన్నులకు తగ్గింది.
దవాఖానల్లో చేరిన రోగుల సంఖ్య తగ్గుతుండటంతో ఆక్సిజన్ డిమాండ్ దిగివచ్చిందని అధికారులు చెబుతున్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ కోటాలో మిగులు నిల్వలను ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆయన వివరించారు.